Skip to main content

ధూర్త మానవులకు త్రిపురనేని వివేకాన్ని ప్రసాదించు గాక !

విగ్రహారాదన ను తీవ్రంగా నిరసించిన మీకు మేము హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మీ విగ్రహాన్ని పెట్టి తప్పు చేసాం.విశ్వమానవాళికి హేతు బుద్దిని ప్రసాదించిన మీకు మత, కుల, ప్రాంతపు రంగు పులిమిన ఈ 'ధూర్త మానవలకు' దశ,దిశా నిర్దేశం కలిగేలా, ప్రజలలో అజ్ఞానం,అంధ విశ్వాసాలు తొలగి వివేకం పెరిగేలా, మత పిచ్చి, కుల పిచ్చి రూపు మాపెలా మన తెలుగు జాతికి జ్ఞానాన్ని కలుగజేయి. ఈ ధూర్త మానవులను క్షమించు.వారికి హేతు బుద్దిని కలిగించు.
త్రిపురనేని రామస్వామి
కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి ప్రముఖ హేతువాది, రచయిత, సంఘసంస్కర్త. త్రిపురనేని రామస్వామి  1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో ఒక రైతు కుంటుంబంలో జన్మించాడు.1898 లో పున్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. 1910లో వారికి ఒక కొడుకు జన్మించాడు. ఆయనే ప్రఖ్యాత రచయిత, త్రిపురనేని గోపీచందు.
1914 లో న్యాయ శాస్త్రం చదివేందుకు డబ్లిన్ వెళ్లాడు. అక్కడ న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యము మరియు ఆధునిక ఐరోపా సంస్కృతి కూడా చదివాడు. డబ్లిన్ లో చదువుతున్న రోజుల్లోనే అనీ బీసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమంకు మద్దతు ఇవ్వవలసినదిగా భారతీయులకు విజ్ఞాపన చేసస్తూ కృష్ణా పత్రిక లో అనేక రచనలు చేశాడు. రామస్వామి స్వాంతంత్ర్యోద్యము రోజులలో ప్రజలకు స్పూర్తినిచ్చి ఉత్తేజపరచే 'వీరగంధం తెచ్చినారం వీరుడు ఎవ్వడో తెల్పుడీ' వంటి అనేక దేశభక్తి గీతాలు రచించాడు.

1917 లో భారత దేశానికి తిరిగివచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మచిలీపట్నంలో న్యాయవాద వృత్తి నిర్వహించాడు. కానీ ఆయన ముఖ్య వ్యాసంగము సంఘ సంస్కరణే. 
స్మృతులు, పురాణాలు మరియు వ్యవస్థీకృత మతము వలన వ్యాపించిన 'కుల వ్యవస్థ' మీద, సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తి స్థాయి ఉద్యమము ప్రారంభించాడు. 1922 లో గుంటూరు జిల్లా, తెనాలి లో స్థిరపడ్డాడు. 1925 లో తెనాలి పురపాలక సంఘ చైర్మనుగా ఎన్నికయ్యాడు. తెనాలి మున్సిపాలిటీ చైర్మెన్ గా ఉన్నపుడు, గంగానమ్మ కొలుపులలో నిర్వహించే జంతుబలిని నిషేధించాడు. ఈ అంశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మను పదవి నుండి తొలగించారు. అయితే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికై, తిరిగి చైర్మను అయ్యాడు. జంతుబలులు మాత్రం సాగలేదు. 1938 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నాడు. 'సూతాశ్రమం' అనిపేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ, సాహిత్య చర్చలతో కళకళలాడుతూ ఉండేది.
సంస్కృత భాషలో ఉన్న పెళ్ళి మంత్రాలను తెలుగులోకి అనువదించి, అచ్చ తెలుగులో సరళమైన 'వివాహ విధి' అను పద్ధతిని తయారు చేసాడు. ఈయన స్వయంగా అనేక పెళ్లిళ్లకు పౌరోహిత్యము వహించాడు.ఆంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. మనసా, వాచా, కర్మణా రామస్వామి ఓ సంస్కర్త. 1943 జనవరి 16న త్రిపురనేని రామస్వామి మరణించాడు.
ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాథనముగా త్రిపురనేని ఎంచుకున్నాడు. రామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నించాడు.. మానవసేవే మాధవసేవ అని నమ్మాడు.
మలమల మాడు పొట్ట , తెగమాసిన బట్ట ,కలంతపెట్టగా
విలవిల యేడ్చుచున్న నిఱుపేదకు జాలిని జూపకుండ, ను
త్తలపడిపోయి, జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్
పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమెచ్చెదన్.

మా మతం గొప్పదంటే కాదు మా మతం గొప్పదని వాదులాడే మతోన్మాదులను ఈసడిస్తూ ....

ఒకరు 'వేదమే' భగవ దుక్తమటంచు నుపన్యసించు నిం
కొకరు 'బైబిలే' భగవదుక్తమటంచును వక్కణించు, వే
రొంకరు మా ' ఖొరాన్ ' భగవదుక్తమటంచును వాదులాడు, నీ తికమక లేల పెట్టెదవు? తెల్పగరాదె నిజంబు నీశ్వరా.

ఈయన చేసిన ముఖ్య రచనలు -
  • సూతపురాణము
  • కొండవీటి పతనము
  • కుప్పుస్వామి శతకం
  • మాల దాసరి
  • గోపాలరాయ శతకం
  • పల్నాటి పౌరుషం
  • శంబూకవధ
  • సూతాశ్రమ గీతాలు
  • ధూర్త మావన శతకము
  • ఖూనీ
  • భగవద్గీత
  • రాణా ప్రతాప్

Comments

Indian Minerva said…
ఒక చిన్న అభ్యర్ధన ప్రతి "డు" నీ "రు" గా మార్చ గలరా (మీరు బాధ పడుంటే క్షమాపణలతో).
G K S Raja said…
Hetuvaadi Garu! Sandarbhochitangaa meeru Tripuraneni vary parichayam ivvadam chala santhosham.
gks raja
హరి said…
త్రిపురనేనిదైనా మరొకరిదైనా ఆరోజున ప్రజలు ఆయా మనుషులపై విరోధంతో ద్వంసం చేయలేదు. కేవలం ప్రాంతీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్న పాలకులకు నిరసనగానే ధ్వంసం చేశారు.

కేవలం విగ్రహాల ధ్వంసాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని మాట్లాడడం హేతువాదం అనిపించుకోదు. ఈ రోజు త్రిపురనేని రామస్వామిగారో, శ్రీశ్రీ గారో బ్రతికివుంటే పరిస్థితిని తప్పక అర్థం చేసుకుని ఉండే వారు.

విగ్రహాల ధ్వంసం ద్వారా ప్రభుత్వాల చేతగాని తనం పైన, రాజకీయుల కప్పదాటు విధానాల పైన నిరసన తెలిపారు.

ఒక ప్రాంతపు ప్రజలంతా 'మీతో కలిసి ఉండడం మాకు సాధ్యం కాదు బాబో' అంటుంటే, 'వీల్లేదు, మీరు మాతో కలిసి ఉండాల్సిందే' అని చేసే నిర్హేతుక వాదనలపై, కపటపు ఉద్యమాలపై నిరసన తెలిపారు.

ప్రజాస్వామ్య బద్ధంగా చేయదలుచుకున్న ర్యాలీని లక్ష అరెస్టులతో అడ్డుకోవాలనుకున్న ప్రభుత్వ అహంకారం పై నిరసన తెలిపారు.

మలమల మాడు పొట్ట , తెగమాసిన బట్ట ,కలంతపెట్టగా
విలవిల యేడ్చుచున్న నిఱుపేదకు జాలిని జూపకుండ, ను
త్తలపడిపోయి, జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్
పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమెచ్చెదన్.

ఆయన ఎంత బాగా చెప్పారు!

జరుగుతున్న దేమిటి? ఒకరు flourine తో కునారిల్లుతుంటే, ఇంకొకరు పొలాలు బీడు పెట్టి పొట్ట చేత బట్టుకుని కూలీ పనికోసమై దేశ ద్రిమ్మరుల్లాగా తిరుగు తుంటే, పక్కనే జీవనది పారుతున్నా వారికి నీరు దొరకదు. ఇంకొకరికి మూడోకారు స్థిరీకరణకు జోరుగా ప్రయత్నాలు జరుగుతుంటాయి, న్యాయపరంగా నీటిలో వాటా లేకున్నా సరే.

ఈ సంఘటనలో దోషులెవరైనా వుంటే, అది త్రిపురనేని విగ్రహాన్ని మాత్రమే పెట్టి, ఆయన ఆలోచనా విధానాన్ని అందుకోలేక పోయిన ప్రభుత్వానిది, వ్యవస్థది.

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...